Kerala High Court : పిల్లలకు చదువు రావాలని, వారు మంచి ప్రవర్తనతో మసులు కోవాలనో ఉపాధ్యాయులు పిల్లలను దండిస్తారు. అయితే, తమను కొట్టారనో, తిట్టారనో ఉపాధ్యాయులపై పిల్లలు పోలీసులకు ఫిర్యాదు చేయడం, పోలీసులు వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు తరుచుగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.
ఉపాధ్యాయుల చేతిలో బెత్తం ఉండాలని స్పష్టం చేసింది. పిల్లలు ఫిర్యాదు చేయగానే పోలీసులు టీచర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చేయొద్దని కీలక ఉత్తర్వులు జారీ చేసింది. క్రిమినల్ కేసు నమోదు చేయడానికన్నా ముందు ప్రాథమిక విచారణ చేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఒక విద్యా సంస్థలో ఏదైనా నేరానికి పాల్పడినందుకు ఉపాధ్యాయుడిపై క్రిమినల్ ఫిర్యాదును కొనసాగించే ముందు ప్రాథమిక విచారణ జరపాలని కేరళ హైకోర్టు ఇటీవల పోలీసులను ఆదేశించింది.
ఎటువంటి దురుద్దేశం లేకుండా చిన్న శిక్షలు విధించినందుకు టీచర్లను క్రిమినల్ ప్రాసిక్యూషన్ నుండి రక్షించాలని న్యాయమూర్తి పి.వి. కున్హికృష్ణన్ అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ఒక నెలలోపు సర్క్యులర్ జారీ చేయాలని రాష్ట్ర పోలీసు చీఫ్ను ఆదేశించింది న్యాయస్థానం. మూడేళ్లు లేదా అంతకంటే ఎక్కువ.. ఏడు సంవత్సరాల కంటే తక్కువ శిక్షార్హమైన నేరాలకు, ప్రాథమిక కేసు ఉందో లేదో తెలుసుకోవడానికి పోలీసులు ప్రాథమిక విచారణ నిర్వహించవచ్చని BNSS సెక్షన్ 173(3)ని కోర్టు ప్రస్తావించింది. విద్యాసంస్థ లోపల వారి కార్యకలాపాలకు సంబంధించి ఉపాధ్యాయుడిపై వచ్చిన ఫిర్యాదులపై కేసు నమోదు చేయడానికి ముందు సెక్షన్ 173(3) ప్రకారం ప్రాథమిక విచారణ నిర్వహించాలంది.
