TTD: తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు కూడా శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. మార్చి 24 నుంచి ఈ విధానం అమలు చేయనున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి..ఈ సిఫార్సు లేఖలను వారంలో రెండు రోజులు మాత్రమే అనుమతిస్తారు. కేవలం ఆది, సోమవారాల్లో మాత్రమే తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ స్వీకరిస్తుంది. వీరికి సోమ, మంగళవారం రోజులలో దర్శనాలకు అనుమతిస్తారు. అలాగే రూ.300 దర్శనం టికెట్లకు సంబంధించి బుధ, గురువారాల్లో ఈ లేఖలు తీసుకుంటారు. ఒక ప్రజా ప్రతినిధి నుంచి ఒక సిఫార్సు లేఖను మాత్రమే అనుమతిస్తారు. ఆ సిఫార్సు లేఖపై ఆరుమందికి మించకుండా దర్శనం కల్పిస్తారు.
సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలు ఇకపై స్వీకరించమని టీటీడీ తెలిపింది. దానికి బదులుగా ఆదివారం దర్శనం కోసం శనివారం రోజు సిఫార్సు లేఖలు స్వీకరించనున్నట్లు టీటీడి తెలిపింది. తిరుమలలో అందుబాటులో ఉన్న వసతి సౌకర్యాలు, ఇతర భక్తుల దర్శన సమయాలు సహా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది.
